ముంబై : ఐపీఎల్లో ఇక ఆర్సీబీ కథ కంచికే. ప్లేఆఫ్ ఆశలు కూడా ఆవిరి…అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఆ జట్టు లెగ్-స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మాత్రం ఈ వాదనతో విభేదిస్తున్నాడు. ముంబై ఇండియన్స్తో సోమవారం వాంఖేడె స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అయిదు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు ఇక ఆడే మ్యాచ్లన్నీ నామమాత్రమేనని తెలిసిందే. ఇప్పటి వరకు ఎనిమిది లీగ్ మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే నెగ్గింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మిగిలిన ఆరు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ప్లేఆఫ్కు అవకాశం ఉంటుందని చాహల్ తెలిపాడు. గత టోర్నీలో 14 పాయింట్లు సాధించిన ఒక జట్టు ప్లేఆఫ్కు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశాడు. అయితే తదుపరి మ్యాచ్ల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేమని పేర్కొన్నాడు. కాగా గత 11 సీజన్లలో 14 పాయింట్లతో ఓ జట్టు ప్లేఆఫ్కు అర్హత సాధించడం నాలుగు సార్లు మాత్రమే జరిగింది. గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు అలాంటి అవకాశం లభించింది.