హైదరాబాద్ : తెలంగాణలో సామాజిక పింఛన్లు వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. గత ఏడాది శాసన సభ ఎన్నికల సమయంలో ఈ పింఛన్లను రెట్టింపు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ నెల నుంచి పింఛన్ల పెంపుదల వర్తిస్తుందని, జులైలో లబ్ధిదారులకు అధికారులు ఆ మొత్తాలను చెల్లిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆసరా పథకం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు ఇస్తున్న పింఛను రెట్టింపు కానుంది. అలాగే వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్ఐవీ పీడితులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులకు ఇకమీదట రూ.2,016 చొప్పున అందుతుంది. దివ్యాంగులకు రూ.3,016 చొప్పున చెల్లిస్తారు.