న్యూ ఢిల్లీ: వయస్సు మీద పడుతోందంటూ ప్రధాని మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంకేతాలు ఇస్తున్నారా? అని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ఇటీవల ఒడిశా ప్రచారంలో అమిత్ షా మాట్లాడుతూ… ‘నవీన్ పట్నాయక్కు ఇప్పుడు 77 ఏళ్లు. వయస్సు మీద పడుతుండటంతో పాటు ఆయన ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన రిటైర్ అవ్వాలి’ అని వ్యాఖ్యానించారు. అమిత్ షా ఈ వ్యాఖ్యలకు చిదంబరం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. వయస్సును కారణంగా చూపుతూ నవీన్ పట్నాయక్ను రిటైర్ కావాలని అమిత్ షా సూచిస్తున్నారని… ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే… మోదీకి పరోక్షంగా ఈ సూచన ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే అమిత్ షానే అత్యంత సంతోషించే వ్యక్తిగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అప్పుడు మోదీ కాకుండా ఆయనే సభలో ప్రతిపక్ష నేతగా కూర్చోవచ్చని పేర్కొన్నారు.