పుణె:ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్, భాజపా కార్యకర్తల్ని ఆదర్శంగా తీసుకోవాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ పార్టీ శ్రేణులకు సూచించారు. మహారాష్ట్ర విధాన సభకు జరగనున్న ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాల రచనలో భాగంగా పవార్ గురువారం కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. ‘మీ (ఎన్సీపీ) కార్యకర్తలు ఓటర్ల దగ్గరికి వెళ్లినప్పుడు వారు ఇంట్లో లేకపోతే ఓ కరపత్రం అక్కడ వదిలేసి వెళ్లిపోతారు. భాజపా కోసం పనిచేసే ఆరెస్సెస్ కార్యకర్తలు మాత్రం అలా కాదు. ఒకవేళ వారు ఇంట్లో లేకపోతే సాయంత్రం మరోసారి వెళ్లి కలిసి వివరించి వస్తారు. అలా వారిని కలిసే వరకు ఓటర్ల ఇంటికి వెళుతూనే ఉంటారు’అని భాజపా నేత ఒకరు తనతో చెప్పినట్లు పవార్ పేర్కొన్నారు. ‘అన్ని విషయాలు ఆరెస్సెస్ నుంచి నేర్చుకోవాలని నేను చెప్పను. ఓటర్లని కలిసే విషయంలో మాత్రం ఆరెస్సెస్ చూపే నిబద్ధత, పట్టుదలను మీరు అనుసరించాల’ని పవార్ సూచించారు. ‘ప్రపంచం ఏ దిశగా వెళుతోంది, శాస్త్రవిజ్ఞానం ఎంతలా అభివృద్ధి చెందింది, అయినా ఇంకా మన ప్రధాని గుహల్లోకి వెళ్లి ధ్యానం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘నాకు ఐదో వరుసలో సీటు కేటాయించారు. రెండు సార్లు రాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించినా ఇదే విషయం చెప్పారు. దీంతో మోదీ ప్రమాణ కార్యక్రమానికి వెళ్లలేదని’ చెప్పారు.