హైదరాబాద్ : జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో కారు దూసుకుపోయింది. దాదాపు అన్ని జిల్లా పరిషత్లనూ కైవసం చేసుకునే దిశగా తెరాస సాగిపోతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం 15 జిల్లా పరిషత్లు తెరాస ఖాతాలో పడిపోయాయి. మిగిలిన వాటిల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాంగ్రెస్ ఏ జిల్లాలోనూ తెరాసకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. దాదాపుగా శాసన సభ ఎన్నికల ఫలితాలే పరిషత్ ఎన్నికల్లోనూ పునరావృతమయ్యాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, ఖమ్మంలలో తెరాస హవా కొనసాగింది. సిద్ధిపేట నియోజకవర్గంలో ఆ పార్టీకి తిరుగు లేకుండా పోయింది. ఇక మండల పరిషత్ ఎన్నికల్లోనూ అనేక జిల్లాల్లో తెరాస ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నిర్మల్లలో మాత్రం కాంగ్రెస్ తెరాసకు బాగా పోటీనిచ్చింది. అయితే దాని ఆధిక్యతను తగ్గించలేకపోయింది.