లండన్ : ప్రపంచ కప్పులో పాకిస్తాన్ ప్రస్థానం ముగిసినట్లేనా…సెమీస్ చేరడానికి ఇంకే మాత్రం అవకాశాలు లేవా…1992లో లాగా పాక్ అనూహ్యంగా ప్రపంచ కప్పును ఎగరేసుకొస్తుందని భావిస్తూ వచ్చిన ఆ దేశ అభిమానుల కలలు కల్లలవుతాయా…వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటే ఇది నిజమవుతుందనిపిస్తోంది. గత నెల 16న టీమిండియా చేతిలో ఓడినప్పుడే పాకిస్తాన్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. తర్వాత ఇంగ్లండ్ గెలుపోటములపై ఆ జట్టు సెమీస్ లెక్కలు ఆధారపడ్డాయి. అయితే భారత్, న్యూజిలాండ్లను చిత్తు చేయడం ద్వారా ఇంగ్లండ్ సెమీస్లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. పాకిస్తాన్ సెమీస్లో చేరాలంటే మరో మూడు అవకాశాలున్నాయి. అయితే ఇది అసాధ్యంగా కనిపిస్తోంది. అదేమంటే..శుక్రవారం బంగ్లాతో తలపడినప్పుడు పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 350 పరుగులు చేయాలి. తర్వాత బంగ్లాను 39 పరుగులకే ఆలౌట్ చేయాలి. తొలుత నాలుగు వందల పరుగులు చేస్తే, బంగ్లాను 84 పరుగులకే ఆలౌట్ చేయాలి. బంగ్లాకు 450 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించి, 129 పరుగుల లోపే ఆలౌట్ చేయాలి. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆట తీరు చూస్తుంటే..ఇది అయ్యే పని కాదని ఎవరికైనా అర్థమవుతుంది.