లాహోర్: పుల్వమా
ఉగ్ర దాడి వల్ల పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచ వ్యాప్తంగా చేదు అనుభవాలను
ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ ప్రధాని, ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఇప్పటికే తొలగించింది. ముంబైలోని బ్రెబోర్న్ స్టేడియంలో ఇమ్రాన్ ఖాన్ ఫొటోలుండేవి. మొహాలి క్రికెట్ స్టేడియంలో ఉన్న 15 మంది పాకిస్తాన్ క్రికెటర్ల ఫొటోలను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) తొలగించింది. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) పోటీలను భారత్లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని డీస్పోర్ట్ ఛానెల్ నిలిపివేసింది. పీఎస్ఎల్కు అధికారిక ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ సైతం ఇకపై ఆ లీగ్ తో ఎటువంటి భాగస్వామ్యాన్ని కొనసాగించబోమని పేర్కొంది. దీనిపై
స్పందించిన పీసీబీ.. ఈ విషయాల్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దృష్టికి తీసుకెళతామని పేర్కొంది. ‘ ఇది చాలా దురదృష్లకరం. పాకిస్తాన్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను సీసీఐ తొలగించడం చాలా బాధాకరం. దాంతోపాటు మా దేశానికి చెందిన క్రికెటర్ల ఫొటోలను కొన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు తొలగించిన విషయం మా దృష్టికి వచ్చింది. భారత్లో పీఎస్ఎల్ మ్యాచుల
ప్రసారాన్ని కూడా నిలిపివేశారు. క్రీడల్ని రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దు. వీటిపై బీసీసీఐతో చర్చిస్తాం. ఐసీసీ వద్దే తేల్చుకుంటాం’ అని పీసీబీ మేనేజింగ్ డైరక్టర్ వసీం ఖాన్ తెలిపారు.