వివాదాస్పద వ్యాఖ్యలు,చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే చాంద్రాయణ గుట్ట శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీపై షియా వక్ఫ్బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 800 సంవత్సరాల కిందటే ముస్లింలు భారతదేశాన్ని పరిపాలించారంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు చేయడాన్ని వసీం రిజ్వీ తపు పట్టారు. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టంపై అక్బరుద్దీన్ ఒవైసీ రెండు రోజుల కిందట నిప్పులు చెరిగారు.తన సామాజిక వర్గం 800 సంవత్సరాలు కిందటే ఈ దేశాన్ని పరిపాలించిందని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని అన్నారు. అలాంటి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు.. తాము భారతీయులమని నిరూపించకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లను చూపాలని అడగడం సరి కాదని చెప్పారు.ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో గల తాజ్మహల్ను ఒవైసీ ముత్తాతలే కట్టించారని తమ లైలా కోసం వారు తాజ్మహల్ను నిర్మించారని వసీం రిజ్వీ ఎద్దేవా చేశారు.ముస్లిం పరిపాలకులు హిందూ ఆలయాలను పడగొట్టించి.. దాని స్థానంలో తాజ్మహల్ను కట్టారని ఆరోపించారు. దీని గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశారు. అదే తరహాలో పవిత్ర మక్కాలోని మసీదును పడగొట్టి హిందూ ఆలయాన్ని కట్టించగలరా? అని సవాల్ విసిరారు.