రాంచీ : సొంతూరు రాంచీలో మహేంద్ర సింగ్ ధోనీ శుక్రవారం ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడబోతున్నాడు. సొంత గడ్డపై అతనికిదే చివరి మ్యాచ్ కావచ్చు. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే సిరీస్ను చేజిక్కించుకోవడంతో పాటు ధోనీకి సొంతూరులో చక్కని బహుమతి కూడా ఇచ్చినట్లవుతుందని టీమిండియా భావిస్తోంది. అయిదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే భారత్ హైదరాబాద్, నాగ్పూర్ వన్డేలలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీ20లో రెండు మ్యాచ్లూ ఓడిపోయిన భారత్, వన్డేలలో ఘన విజయం సాధించడం ద్వారా పోయిన ప్రతిష్టను నిలబెట్టుకోవాలని తహతహలాడుతోంది. ఈ వన్డేలో పెద్ద మార్పులేమీ చేయకుండానే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అంబటిరాయుడిని తప్పించి, కేఎల్. రాహుల్ను ఆడించే అవకాశం లేకపోలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ను ఆడించే విషయంలో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ, అతనిని తొలగించే సాహసం చేయకపోవచ్చు. ఈ స్టేడియంలో భారత్ ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడగా, రెండిట్లో విజయం సాధించింది.