పదేళ్లుగా కోమాలొ..ఇటీవల ప్రసవం

పదేళ్లుగా కోమాలొ..ఇటీవల ప్రసవం

ఆసుపత్రి సిబ్బందిపైనే అనుమానం
దాదాపు పదేళ్లుగా కోమాలో ఉన్న ఓ మహిళ కొద్ది రోజుల క్రితం బిడ్డకు జన్మనిచ్చారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఫొనిక్స్ పట్టణానికి సమీపంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇన్నాళ్లూ అచేతన స్థితిలో బెడ్‌మీద పడి ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడిందెవరో గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇక్కడ పనిచేసే సిబ్బందిలోనే ఎవరైనా ఆ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటారన్న అనుమానంతో ఈ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న మగ సిబ్బంది డీఎన్‌ఏ నమూనాలు సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. అందుకోసం ఆస్పత్రి యాజమాన్యానికి వారెంట్ జారీ చేశారని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది.

అత్యంత హేయమైన ఈ ఘటన తర్వాత నర్సింగ్ హోం సీఈఓ రాజీనామా చేశారు.
అసలేం జరిగింది?
29 ఏళ్ల ఆ మహిళ దాదాపు దశాబ్ద కాలంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు.

ఆమె డిసెంబర్ 29న ప్రసవించినట్లు స్థానిక కేపీహెచ్‌వో-టీవీ తెలిపింది.

ఇన్నేళ్లుగా ఎలాంటి చలనం లేకుండా కోమాలో ఉన్న ఆమెలో ఆరోజు ఒక్కసారిగా కదలికలు కనిపించాయని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. పురుటి నొప్పులతో మూలుగుతుండగా గమనించి నర్సులు ఆమెకు ప్రసవం చేసినట్లు ఓ వ్యక్తి చెప్పారు.

ఆమె 24 గంటలూ వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారని, ఆమె ఉన్న గదికి చాలామంది వెళ్లేవారని ఆయన చెప్పినట్లు కేపీహెచ్‌వో-టీవీ పేర్కొంది.

“అప్పటి దాకా కోమాలో ఉన్న ఆమె ఒక్కసారిగా మూలగడం మొదలుపెట్టారు. ఆమెకు ఏం జరుగుతోందో సిబ్బందికి అర్థం కాలేదు. బిడ్డకు జన్మనిచ్చేదాకా ఆమె గర్భం దాల్చారన్న విషయం సిబ్బందిలో ఎవరికీ తెలియదు” అని ఆ వ్యక్తి వివరించారు.

ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos