సూపర్స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం దర్బార్ విడదలవుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా రజనీ అభిమానులు దర్బార్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక రజనీని దేవుడిగా కొలిచే తమిళనాడులో అయితే పరిస్థితి మరో స్థాయిలో ఉంది.దర్బార్ చిత్రం విడుదల సందర్భంగా చెన్నై సిటీలో కొన్ని ప్రయివేటు సంస్థలు ఏకంగా సెలవులను ప్రకటించాయి. మరికొన్ని సంస్థలు సెలవులతో పాటు ఉచితంగా దర్బార్ టిక్కెట్లను పంపిణీ చేసి సూపర్ స్టార్ పై అభిమానం చాటుకున్నాయి. ఇంకా మరికొన్ని సంస్థలు ఉద్యోగులకు టిక్కెట్లు పంచి పెయిడ్ హాలీడేస్ ని ప్రకటించాయి. సెలవు కావాలంటే ఆ రోజుకి కొంత డబ్బు కడితే సదరు సంస్థనే టిక్కెట్ ఇచ్చి సెలవు ఇస్తుందన్న మాట. మరోవైపు సేలంలోని రజనీ అభిమానులు ఒకడుగు ముందుకేసి దర్బార్ ప్రదర్శించే థియేటర్ల పై హైలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించడానికి సన్నాహాకాలు చేస్తున్నారు.దానికి సంబంధించి ముందస్తుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. గతంలో సూపర్ స్టార్ నటించిన పేట సినిమా విడుదలైనప్పుడు కొన్ని ప్రయివేటు సంస్థలు సినిమా టికెట్లు ఇచ్చి సెలవులు ప్రకటించారు. థియేటర్ సమీపంలో ఉన్న స్కూళ్లకు రద్దీని దృష్టి లో పెట్టుకుని సెలవులు ఇచ్చారు.