న్యూ ఢిల్లీ: ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్ నోబెల్ శాంతి బహుమతిని ఆశించటం విడ్డూరంగా ఉందని భాజపా సీనియర్ నేర రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ జరిగిన ఇండియా టుడే శిఖరాగ్ర సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ ప్రస్తుతం పాకిస్తాన్ వాసులు కొందరు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ ప్రతినిధులు తమ ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుకుంటున్నారు. సరే ఆయనను బహుమతి తీసుకోమనండి. అయితే అది నిజంగా పాకిస్తాన్ ప్రజలకు పనికి వచ్చే అంశమేనా? ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ఇమ్రాన్ నిజంగా భావిస్తే పాక్, భారత్లతో పాటు ప్రపంచం మొత్తానికీ కూడా మంచిదే. వాళ్లు మారతారని అనుకోవడం లేదు. వారి సంకుచిత విధానాలే ప్రస్తుత పరిస్థితులకు కారణాలు. పాకిస్తాన్ పన్నాగంలో చిక్కాలని ఎవరూ అనుకోవడమూ లేదు’ అని ధ్వజమెత్తారు. శాంతి చర్చలకు నందిగానే అభినందన్ను విడిచి పెట్టామని పాక్ చెబుతుండగా జెనీవా ఒప్పందాన్ని అనుసరించి మాత్రమే అతణ్ని స్వదేశానికి అప్పగించారని భారత సైన్యం పేర్కొంది. భారత పైలట్ అభినందన్ను క్షేమంగా అప్పగించినందుకు తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించాలని పాకిస్తానీయులు డిమాండ్ చేసారు. ఈ మేరకు ట్విటర్లో #NobelPeacePrizeForImranKhan అనే ఉప శీర్షికతో సంచరిస్తోంది. చైనా కూడా అభినందన్ విడుదల ద్వారా ఇమ్రాన్ శాంతికి ఆహ్వానం పలికారని ప్రశంసలు కురిపించింది.