చిత్ర పటంలో అమరావతి మాయం

చిత్ర పటంలో అమరావతి మాయం

ఢిల్లీ : భారత ప్రభుత్వం విడుదల చేసిన కొత్త భారత చిత్ర పటం నుంచి అమరావతి మాయమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఈ చిత్ర పటాన్ని విడుదల చేసింది. అందులో కొత్త కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లడక్ లను చేర్చారు. అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లను కూడా చిత్రపటంలో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని మాత్రం కనిపించడం లేదు. అమరావతిని అందులో చేర్చలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు పేరు చేర్చారు. దాన్ని బట్టి ఏపీ రాజధానిగా అమరావతి ఉండబోదనే స్పష్టత వచ్చినట్లు భావిస్తున్నారు. ఇండియన్ మ్యాపులో అమరావతి లేకపోవడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధానిని మరో ప్రాంతానికి తరలిస్తున్నారనేది అర్థమవుతోందని టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య హిందుస్తాన్ టైమ్స్‌తో అన్నారు. రాజధాని తరలింపుపై కేంద్రానికి తన అభిప్రాయాన్ని జగన్ కు చెప్పి ఉంటారని అన్నారు. సవరించిన భారత చిత్ర పటంలో అమరావతి లేకపోవడానికి కారణమదే అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని పేరు లేకుండా చిత్ర పటంలో ఆంధ్రప్రదేశ్ చోటు చేసుకోవడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. దానికి చంద్రబాబు నాయకత్వంలోని గత టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. అమరావతిలో శాశ్వత నిర్మాణాలను కాకుండా తాత్కాలిక నిర్మాణాలను చేపట్టారని, అమరావతిని రాజధానిగా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆయన తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos