దేశవ్యాప్తంగా ఆందోళనలు,నిరసనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఎన్ఆర్సీపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జాతీయ జనాభా రిజిస్టర్ (నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్–ఎన్ఆర్సీ) పై ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం ప్రకటించింది. జాతీయ పౌరసత్వ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీలపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్ఆర్సీకి మార్గం సుగమం చేసేందుకే పౌరసత్వ చట్టంలో సవరణలు అంటూ పలు ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేయడం గమనార్హం. అదికూడా పార్లమెంటులో లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ ఎన్ఆర్సీపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అందువల్ల ఆందోళనలు విరమించాలని కోరింది. కేరళ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు సీఏఏ అమలు చేయమంటూ తీర్మానాలు చేయడం, దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతుండడంతో కేంద్రం వెనుకడుగు వేసిందని భావిస్తున్నారు.