లండన్: పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి ఇంగ్లాండ్ వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరుకు తిరస్కరించింది. ఆయనకు బెయిల్ నిరాకరించడం ఇది వరుసగా నాలుగోసారి. గత మార్చి 20న అరెస్టయిన నీరవ్ ప్రస్తుతం లండన్లో ఖైదీలతో కిటకిటలాడే హెర్ మెజిస్టీస్ వాండ్స్వర్త్ జైలులో ఉన్నారు. ఆర్థిక నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ప్రకారం నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు ఇంగ్లాండ్ నిర్ణయిస్తే ఆయనను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో బంధించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా జరుగు తున్నాయి. 2018 జనవరి నుంచి తాను చట్ట బద్ధంగా బ్రిటన్లో ఉద్యోగం చేయటంతో బాటు పాటు పన్నులు కూడా చెల్లిస్తున్నానని నీరవ్ మోదీ వాదిస్తున్నారు. తనపై ఎలాంటి నేరారోపణ జరగక ముందు భారత్ నుంచి బ్రిటన్కు వచ్చినట్లు నీరవ్ పేర్కొన్నారు. తనను అప్పగిం చాలని భారత్ చేసిన వినతిని తిరస్కరించాలని ఆయన బ్రిటన్ ప్రభుత్వానికి విన్నవించారు.