కొత్త అధ్యాయం మొదలు…

కొత్త అధ్యాయం మొదలు…

ఢిల్లీ: అయోధ్య అంశంపై సుప్రీం కోర్టు మహోన్నత తీర్పు వెలువరించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చరిత్రలో ఇవాళ కొత్త అధ్యాయం మొదలైందని చెప్పారు. అయోధ్య అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించిన నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సుప్రీం కోర్టు తీర్పును దేశమంతా స్వాగతించిందన్నారు. ‘‘దీర్ఘకాలిక సమస్యపై సుప్రీం కోర్టు మహోన్నత తీర్పు వెలువరించింది. దశాబ్దాల పాటు సాగిన న్యాయ ప్రక్రియ నేటితో ముగిసింది. భారత న్యాయ వ్యవస్థలో ఈ రోజు సువర్ణాధ్యాయం మొదలైంది. తీర్పును దేశమంతా స్వాగతించింది. భిన్నత్వంలో ఏకత్వం అనే మంత్రం సంపూర్ణత్వంతో ఇవాళ వికసించింది. భారత దేశపు ఈ మూల సూత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు. అన్ని వర్గాల వాదనలను సుప్రీం కోర్టు ఎంతో ఓపిగ్గా ఆలకించింది. ఏకగ్రీవంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. అందరినీ ఒప్పించడం అంత సులువైన విషయం కాదు. న్యాయమూర్తులకు, న్యాయాలయాలకు అభినందనలు. 30 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే నవంబర్ 9న బెర్లిన్ గోడ కూలింది. మళ్లీ అదే రోజు కర్తార్‌పూర్‌ కారిడార్ ప్రారంభమైంది. అయోధ్య కేసులో కోర్టు తీర్పు కూడా వెలువడింది. ఇది కలిసికట్టుగా నడవాలని ఇస్తున్న సందేశం. ఐకమత్యంగా కలిసి ఉండే సమయం. కొత్త ప్రారంభానికి శ్రీకారం చుడదాం. నవ భారతాన్ని నిర్మిద్దాం. అందరినీ కలుపుకొనిపోతూ అందరి అభివృద్ధి కాంక్షిస్తూ మనం ముందుకు సాగుదాం’ అని మోదీ పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos