మునుగోడు : ఉప ఎన్నికల ప్రచారంలో ఆయా రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున ప్రచారం చేపట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఘాటుగా విమర్శించారు. ‘మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి ఓటు హక్కే లేదు. అలాంటి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలను ఓటు ఎలా అడుగుతారు. అసలు రాజగోపాల్ రెడ్డి ఊరే మునుగోడు శాసనసభ నియోజక వర్గంలో లేద’న్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మునుగోడులో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి 22 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాలుగేళ్లు తిరక్కుండానే రూ.22 వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుబోయారని విమర్శించారు. 2009కి ముందు రాజగోపాల్ రెడ్డి ఎవరో కూడా జనాలకు తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని బొడ్డులో కత్తులు పెట్టుకుని తిరిగిన నేతలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి తప్పు చేసామన్నారు. మునుగోడును తానే దత్తత తీసుకుంటానన్న రేవంత్, సోనియా, రాహుల్ గాంధీలను మునుగోడుకు తీసుకువస్తానని చెప్పారు.