మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తూ మైదానంలో ఒత్తిడికి లోనయ్యే సహచరులకు సలహాలు,సూచనలు చెబుతూ విజయాలు దక్కించుకునే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంపైర్లపై ఆవేశంగా వాదనకు దిగాడు.ఐపీఎల్ 12వ సీజన్లో భాగంగా గురువారం జైపూర్లో చెన్నై,రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.రాజస్థాన్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు టాప్ ఆర్డర్ విఫలం కావడంతో 50 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది.ఈ తరుణంలో బ్యాటింగ్ దిగిన ధోని అంబటి రాయుడుతో కలసి జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు.చివరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం. చివరి ఓవర్ అందుకున్న స్టోక్స్.. తొలి బంతి ఆఫ్స్టంప్ ఆవల వేయగా జడేజా సిక్స్ బాదాడు. తర్వాత స్టోక్స్ నోబాల్ వేయగా.. జడేజా సింగిల్ తీశాడు. ఫ్రీహిట్కు ధోనీ రెండు పరుగులు తీశాడు. కానీ తర్వాతి బంతిని స్టోక్స్ యార్కర్ వేయగా.. సరిగ్గా అంచనా వేయలేక ధోనీ బౌల్డయ్యాడు. దీంతో చెన్నై చివరి మూడు బంతుల్లో 8 పరుగులు చేయాలి.ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్ సాంట్నర్ 2 పరుగులు చేశాడు. అయితే ప్రధాన అంపైర్ హైట్ దీనిని తొలుత నోబాల్గా ప్రకటించి… ఆ తర్వాత లెగ్ అంపైర్ కాదనడంతో వెంటనే చేతిని దించేశాడు. ఈ క్రమంలో అయోమయం నెలకొనడంతో నాన్- స్ట్రైక్లో ఉన్న జడేజా మొదట అంపైర్లను ప్రశ్నించాడు. తర్వాత కెప్టెన్ ధోని కూడా మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదించాడు. కానీ అంపైర్లు అది నోబాల్ కాదనడంతో చేసేదేమీలేక ధోని నిరాశగా డగౌట్ చేరాడు. ఈ నేపథ్యంలో అతడి మ్యాచ్ ఫీజులో సగం కోత విధించారు..