బెంగళూరు:తెలంగాణలో సీనియర్ దళితనేత, ఆరుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ఎన్టి.రామరావు నాయకత్వలోని తెలుగు దేశం ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించిన మోత్కుపల్లి నర్సింహులు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోనున్నారా? ఔనంటున్నారు రాజకీయ పరిశీలకులు. శుక్రవారం ఇక్కడ ఆయన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ను ఆయన నివాసంలో కలసుకుని మంతనాలు జరపటంతో పరిశీలకుల మదింపునకు ఊతమిమచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు శాసనసభ నియోజక వర్గం నుంచి తెలుగుదేశం, స్వతంత్య్ర అభ్యర్థిగా ఆరుమార్లు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా బిఆర్ఎస్ నేత కెసిఆర్ వినతి మేరకు ఆ పార్టీలో చేరారు. దళితుల్ని ఆదుకునే దళిత బంధు పథకం అమలుకు సారథిని చేస్తామని ఆశలు చూపారు. తర తరాలుగా అణచివేతకు గురైన తమ వారికి మేలు జరుతుందనే ఆశతో మోత్కుపల్లి బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే హుజూరా బాద్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థి పరాజయం కావటంతో మోత్కుపల్లి నర్సింహుల్ని నాయకత్వం పక్కన బెట్టింది. ఏరుదాటి తెప్ప తగలేసిన చందంగా వ్యవహరించింది. చివరకు కెసిఆర్తో మాట్లాడే అవకాశం కూడా లభించక పోవటంతో పాత మిత్రుడు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రోతాత్సాహంతో హస్తంతో జత కట్టేందుకు సుముఖత చూపినట్లు తెలిసింది. శివకుమార్తో ఆయన సాగించిన మంతనాలు వివరాలు ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది.రేవంత్ రెడ్డి, శివకుమార్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటం తెలిసిందే.