ఆంగ్ల కొత్త ఏడాది సందర్భంగా భారత్ పొరుగుదేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ అధినేతలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మాత్రం శుభాకాంక్షలు చెప్పలేదు.గత ఏడాదిన్నర కాలంగా భారత్, పాకిస్థాన్ ల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. పుల్వామాలో 40 మంది పారామిలిటరీ సైనికులను ఉగ్రవాదులు చంపిన తర్వాత భారత్ ఆగ్రహంతో ఊగిపోయింది. ఆ తర్వాత ఏకంగా పాక్ భూభాగంపైనే దాడి చేసి, బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. అనంతరం జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత… అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను దోషిగా నిలబెట్టేందుకు పాక్ చేయని ప్రయత్నం లేదు. ఆ దేశానికి ఇతర దేశాల నుంచి మద్దతు రాకపోవడంతో… చివరకు ఏకాకిగా మిగిలిపోయింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనే, ఇమ్రాన్ ఖాన్ కు మోదీ శుభాకాంక్షలు తెలియజేయలేదని తెలుస్తోంది..