ఢిల్లీ: కరోనా విషయంలో మాధ్యమాల్లో వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. మాస్కులు అందరూ ధరించాల్సిన అవసరం లేదని, సామాజిక దూరం పాటిస్తే సరిపోతుందని తెలిపింది. నేటి నుంచి 111 ల్యాబ్లు దేశ వ్యాప్తంగా పని చేయనున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ కలిసికట్టుగా పోరాడితే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలమని అగర్వాల్ అన్నారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరారు. దేశ వ్యాప్తంగా 111 పరిశోధనశాలలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రైవేటు రంగంలో ల్యాబ్లకు అనుమతించేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. రాష్ట్రాల అవసరాల మేరకు ల్యాబ్లను పెంచడంపై పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని అగర్వాల్ అన్నారు. జనంలో ఉన్నప్పుడు ఒక మీటర్ సామాజిక దూరం పాటిస్తే సరిపోతుందన్నారు. ఎన్95 మాస్కులు అందరూ ఉపయోగించాల్సిన అవసరం లేదని, అవి కేవలం ఆస్పత్రుల్లోనే వినియోగిస్తారని పేర్కొన్నారు. మాస్కులకు సంబంధించి అందరూ కేంద్ర మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరుకు విపత్తు నిర్వహణ నిధులు వినియోగించుకోవచ్చని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చిన 1600 మంది భారతీయులు, విదేశీయులను క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచినట్లు తెలిపారు. విదేశాల నుంచి ఎక్కువగా విద్యార్థులు వస్తున్నారని అగర్వాల్ తెలిపారు.