తిరువనంతపురం: వయనాడ్ జిల్లా మనంతవాడీ విధానసభ నియోజకవర్గం భాజపా అభ్యర్థి మణికంఠన్ తాను ఎన్నికలలో పోటీ చేయనని సోమవారం ఒక వీడియో ద్వారా వెల్లడించారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి లేదన్నారు. “వయానాడ్ వాసిగా నాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. కానీ నాకు స్థానికంగా ఉన్న పశువైద్య శాస్త్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా కొనసాగడమే ఇష్టం. నాకు క్రియాశీల రాజకీయాలపై ఆసక్తి లేదు. కాబట్టి నేను ఈ అవకాశాన్ని తిరస్కరిస్తున్నాను’అని పేర్కొన్నారు. ఎన్నికల అభ్యర్థుల జాబితాను భాజపా ఆదివారం ప్రకటించింది. అందులో మణికంఠన్ పేరు కూడా ఉంది. ప్రకటన వచ్చేవరకు ఈ విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని మణికంఠన్ పేర్కొన్నారు.ఎన్నికల్లో పోటీపై భాజపా మణికంఠన్ను సంప్రదించిందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ విషయంపై ఇంకా భాజపా స్పందించలేదు.