నటీనటులు: అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నా, సుజానే బెర్నెట్, అర్జున్ మాథుర్, అహానా కుమ్రా
సంగీతం: సుదీప్ రాయ్, సాధూ తివారీ
దర్శకుడు: విజయ్ రత్నాకర్
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన వద్ద జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారూ రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే బయోగ్రఫీ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు విజయ్ రత్నాకర్ తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచీ వివాదాలు ఎదుర్కొంటోంది. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను గురించి తప్పుగా చూపించారని, వాస్తవాలను వక్రీకరించారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. తమకోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా చేశారు. అయితే దానికి చిత్ర బృందం ఒప్పుకోలేదు. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. మరి ఈ బయోపిక్ ఏ మేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో చూద్దాం..
కథేంటంటే: 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అయితే, ప్రధానమంత్రి పీఠంపై ఎవరిని కుర్చోబెట్టాలా అని తర్జనభర్జనలు పడుతున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (సుజానే బెర్నెట్) ఆర్థిక వేత్త అయిన మన్మోహన్సింగ్ను (అనుపమ్) ప్రధానిగా ప్రకటిస్తారు. దీంతో ఈ విషయం కాస్త రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. ఒక్క రోజులో మన్మోహన్ పేరు మార్మోగిపోతుంది. అయితే, ప్రధాని అయిన తర్వాత మన్మోహన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరి నిర్ణయాలను అమలు చేసేవారు? ప్రధానిగా తన పాత్ర ఏ స్థాయిలో ఉండేది? ఆయనపై ఎవరెవరి ప్రభావం ఉండేది? మొదలనవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!