ముంబై : కరోనా విజృంభణతో మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితమవుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. తాజాగా 11 కరోనా కేసులు పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వైరస్ బాధితుల సంఖ్య 63కు చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో ఎనిమిది మంది విదేశీ ప్రయాణం చేయగా.. మిగిలిన వారికి ఇతరుల నుంచి సోకిందని వైద్యులు ప్రకటించారు. మహారాష్ట్రలో కరోనా స్టేజ్3 దిశగా పయనిస్తోందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ఆయన తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు దయచేసి బయట తిరగవద్దని కోరారు. ప్రజలంతా సామాజిక దూరంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రజలు తమ అనవసర ప్రయాణాలను తగ్గించుకోకపోతే ప్రజా రవాణాను తాత్కాలికంగా మూసివేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.