ఢిల్లీ : లాక్డౌన్పై కేంద్రం పునరాలోచన చేయాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సూచించారు. ఒకవైపు ప్రజల లాక్డౌన్.. మరోవైపు ఆర్థిక వ్యవస్థ లాకౌట్ ఉండకూడదని అభిప్రాయపడ్డారు. మేం మంచి సూచనలే చేస్తున్నాం.. ప్రస్తుత తరుణంలో ప్రభుత్వంతోనే ఉన్నామని తెలిపారు. విపత్తు నిర్వహణ చట్టం కింద కరోనా కట్టడికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. లాక్డౌన్ విధించేముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు మాదిరిగానే ఈ నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నట్లు విమర్శించారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు రోడ్లమీద ఉన్నారు.. వారిని ఆదుకునేందుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. డీఏలను నిలిపివేయడం కూడా తగదన్నారు. ప్రస్తుత తరుణంలో అందరికీ డబ్బు చాలా అవసరమని పేర్కొన్నారు. మరోవైపు వచ్చేవారంతో లాక్డౌన్ ముగుస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం మరోసారి సమావేశం కానున్నారు.