త్వరలో జరగనున్న ఏపీ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరచూ స్పష్టమైన ప్రకటనలు చేస్తూనే వస్తున్నారు.అయితే మరోసారి పవన్ తో కలిస్తే తప్పేంటి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసార మాధ్యమాల ముఖంగా వ్యాఖ్యానించగా ఇదే విషయాన్నీ హైలైట్ చేస్తూ కొన్ని ప్రసార మధ్యలు కూడా వార్తలు ప్రసారం చేయడంతో జనసేన విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది.ఇంత జరిగిన మౌనంగా ఉంటే మొదటికే మోసం వస్తుందనే విషయాన్నీ గ్రహించిన పవన్ కళ్యాణ్ సోలోగా పోటీ, కమ్యూనిస్టులను కలుపుకుంటున్నట్టుగా ప్రకటించాడు.ఎన్నికల్లోపు ఏ సమయంలో ఈ మాట తప్పినా పవన్ కల్యాణ్ చులకన అవడం ఖాయం. ఇక ఎలాగూ పొత్తు ఉంటుందంటూ పవన్ స్వయంగా ప్రకటించాడు కాబట్టి ఇవన్నీ గమనించిన.. సీట్ల సర్దుబాటుపై మాట్లాడుకుందామంటూ కమ్యూనిస్టు పార్టీల నేతలు అంటున్నారట. ఈ మేరకు వారు పవన్ ను కలిసినట్టుగా కూడా తెలుస్తోంది.సీపీఐ, సీపీఎంలు పవన్ తో పొత్తు పెట్టుకోవడానికి మొదటి నుంచి చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఇక ఈ పార్టీల నేతలు ఆమ్ ఆద్మీ, లోక్ సత్తాలు కూడా తమకు మద్దతు పలుకుతాయంటూ ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా 175 సీట్ల పైకి తమకు 60 ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలంటూ వామపక్షాల నేతలు పవన్ దగ్గర ప్రస్తావించారట. బహుశా గత కొన్ని దశాబ్దాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏ పార్టీతో పొత్తులతో వెళ్లినా ఇన్ని సీట్లు పోటీచేసిన చరిత్రలేదు. పవన్ కల్యాణ్ ను కమ్యూనిస్టులు ఎంత తక్కువ అంచనా వేస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఈ కోరికే రుజువు.175 సీట్లకు గానూ మరీ 60 సీట్లను అడగటం అంటే.. కమ్యూనిస్టు పార్టీల ప్రస్తుత స్థితికిగానూ చాలా చాలా ఎక్కువే! ఏ టీడీపీతోనో, వైసీపీతోనో పొత్తుకు వెళ్లి ఉంటే.. ఎర్రన్నలు ఇన్ని సీట్లు అడగ గలిగేవారా? ఐదారు సీట్లకు మించి సాధించగలిగే వారా?అంటూ రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.పవన్ కల్యాణ్ పార్టీకి ఇంకా ఏ నిర్మాణం లేదు కాబట్టి.. పవన్ పార్టీ మీద ఎర్రన్నలకే మరీ బీభత్సమైన అంచనాలు లేవు కాబట్టి.. అరవై.. అనే నంబర్ ను రైజ్ చేయగలుగుతున్నారు. అరవై ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్నారంటే.. ఏడెనిమిది ఎంపీ టికెట్లు కూడా అడుగుతున్నట్టే.మరి పవన్ కమ్యూనిస్టులకు అరవై సీట్లనూ అప్పగిస్తే.. ఆయన తన పార్టీని చాలా తక్కువ చేసుకున్నట్టే.