వెల్లింగ్టన్: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో హామిల్టన్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని ఎదురుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్.. కివీస్ బౌలర్ల ధాటికి 92 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత కివీస్ జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 బంతులు మిగిలి ఉండగానే.. ఈ మ్యాచ్లో విజయం సాధించింది. అంతకు ముందే ఈ సిరీస్లో మూడు మ్యాచులు గెలిచి సిరీస్కి దక్కించుకున్న భారత్ ఈ మ్యాచ్లో ఘోరంగా విఫలం కావడంతో విమర్శల వర్షం కురుస్తోంది. కనీసం ఒక బ్యాట్స్మెన్ కూడా తమ వికెట్ని కాపాడుకోలేకపోవడం దురదృష్టకరమని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దీంతో వెల్లింగ్టన్ వేదికగా జరిగే ఆఖరి వన్డే కోసం టీం ఇండియా పటిష్టంగా వ్యూహాలు రచిస్తోంది. మూడు, నాలుగో వన్డేల్లో జట్టుకి దూరంగా ఉన్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని తిరిగి జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది. ధోనీ జట్టులో ఉంటే అతని అనుభవంతో జట్టును గట్టెక్కించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. దీంతో దినేశ్ కార్తీక్ లేదా మరో ఆటగాడిని జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో ధోనీని జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. కాగా ఐదో వన్డే వెస్ట్ప్యాక్ స్టేడియం వేదికగా ఆదివారం ఉదయం 7.30 నుంచి ప్రారంభంకానుంది.