‘చిత్తూరు పడమటి మండలాలు తెదేపాకు కంచుకోట. అందుకే ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటున్నా. ఈ నెల ఆఖరు కల్లా కుప్పానికి నీళ్లు అందిస్తామని’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మదనపల్లెలో సోమవారం జరిగిన ‘జలసిరికి హారతి’లో ప్రసంగించారు. ‘మదనపల్లె ప్రజలు వైసీపీ ని గెలిపించినా ఆ నేతలు ఏ నాడూ ఇక్కడి నీటి సమస్యను పట్టించుకోలేదు. వైసీపీ నేతలు అసెంబ్లీకి రారు. ప్రజా సమస్యలను పట్టించుకోరు. జీతాలు మాత్రం తీసుకుంటారు. ఇదెక్కడి న్యాయమ’ని ప్రశ్నించారు. కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లు ఇస్తామని గతంలో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని గుర్తు చేసారు. ఎన్నికల్లో పులివెందుల వాసులు ఓడించినా వారికి చెప్పారు. నాయకుడు సమాజ హితం కోసం పని చేస్తారంటూ తాను ఇందిరా గాంధీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ చాలామందిని చూశానన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని విన్నవించారు. తాను ఎక్కడున్నా ఈ గడ్డకు బిడ్డనేనని అభివర్ణించారు. సీమ ప్రజల కష్టాలు తీరడానికి పోలవరం ప్రాజెక్టును కడుతున్నామన్నారు. అది పూర్తవడానికి చాలా సమయం పడుతున్నందున పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామని వివరించారు.