కొద్ది రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న తెరాస కార్యాధ్యక్షుడు కేటీఆర్ తాజాగా మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేశారు.ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కేవలం ప్రోత్సాహకాలు మాత్రమేనని ప్రజలకు మనమేమి బాకీ పడలేదంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.సంక్షేమ పథకాలు అందటం లేదని ప్రజలు, ప్రజా ప్రతినిధులను, అధికారులను నిలదీస్తున్నారని , గొడవకు దిగుతున్నారని జడ్పిటిసి సభ్యులు కేటీఆర్ కు విన్నవించగా దీనిపై స్పందించిన కెటీఆర్ ప్రజలకు మనమేమీ బాకీ లేమని తేల్చిపారేశారు. ఏదైనా పథకం తమకు అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే ప్రజా ప్రతినిధులు, అధికారులు వారికి నచ్చచెప్పాలని సూచించారు. వారితో గొడవకు దిగొద్దని కేటీఆర్, ఇక ప్రజా ప్రతినిధులను, ప్రజలను ఉద్దేశించి ఈ విషయంలో అధికారులను అడగండి కానీ ,నిలదీయవద్దని వారికీ భార్య, పిల్లలు ఉంటారని పేర్కొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు మాత్రమేనని, ప్రోత్సాహకాలు ఉన్నంత మాత్రాన అవి ప్రజలకు బాకీ పడిన సొమ్ము కాదని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మనమేమీ బాకీ లేమని, సంక్షేమ పథకాలు అందించినంత మాత్రాన ప్రజలకు బాకీ ఉన్నట్టు కాదని పేర్కొన్నారు. అవగాహనతో అధికారులను ప్రశ్నిస్తే గౌరవం పెరుగుతుందని, లొల్లి చేస్తే పేపర్లో ఫొటోలు మాత్రమే వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటికి మొన్న డాక్టర్లను ఉద్దేశించి ఇష్టం ఉంటే పని చేయండి లేకపోతే మానేసి వెళ్లిపోండి కొత్తవారిని తీసుకుంటామంటూ చేసిన వ్యాఖ్యలు మరవకముందే ప్రజలకు మనమేమీ బాకీ లేమని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో,ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతోంది..