బొమ్మనహళ్లి : ఆధునిక గురుకుల పద్ధతి తోనే ఉత్తమ ఫలితాల్ని సాధించ వచ్చని కృపానిధి విద్యాసంస్థల ఛేర్మన్ డాక్టర్ ఆచార్య సురేశ్ నాగ్పాల్ పేర్కొన్నారు.శుక్రవారం ఇక్కడ కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన 2019 ద్వితీయ పీయూసి పరీక్షల్లో ఎక్కువ మార్కుల్ని పొందిన విద్యార్థుల్ని అభినందించారు. 95 శాతం కంటే ఎక్కువ మార్కుల్ని పొందిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల్ని పంపిణీ ద్వారా ఉచిత విద్యా బోధన చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. తమ కళాశాల చక్కటి ఫలితాలకు ప్రత్యామ్నాయంగా మారిందని చెప్పారు. గురుకుల పద్ధతిలో విద్యా బోధన సాగించటమే దీనికి కారణమన్నారు . ట్యూషన్ల వల్ల విద్యా రంగంలో వ్యాపారంగా మారుతోందని అసంతృప్తి వ్యక్తీ కరించారు. విద్య పేరిట విద్యార్థుల్ని ఒత్తిడి చేయటం మంచిది కాదని హెచ్చరించారు. ఆట,పాటలతో విద్యార్జన చేసినవారిలో విద్యా స్థాయి గోచరిస్తుందన్నారు. పిల్లలు పాఠాల్ని బాగా అర్థం చేసుకునే పరీక్షల్ని రాయాలని సూచించారు. కంఠోపాఠాల ద్వారా పరీక్షలు రాయటం మంచి పద్ధతి కాదన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు సరైన మార్గ దర్శనం చేయాలని కోరారు.కళాశాల ప్రిన్సిపాల్ వీణ.జి.షాజహాన్ః, ఉపాధ్యాయులు రామకృష్ణ ,శ్వేత సింధ్వాణి, అస్టియ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.