ముంబై: గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను విడిచి వెళ్లితే దేశ ఆర్థిక రాజధానిలో డబ్బేం మిగలదని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి వ్యాఖ్యానించారు. ముంబై పశ్చిమ శివార్లలోని అంధేరిలో ఒక చౌక్కు పేరు పెట్టే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ”నేను ఇక్కడి ప్రజలకు ఒకటి చెప్పదలచుకున్నాను. గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను వీడి వెళ్లితే, ముఖ్యంగా ముంబై, థానేను విడిచిపెడితే, ముంబైలో డబ్బేం మిగలదు. దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హత ముంబై కోల్పోతుంది” అని వ్యాఖ్యానించారు. ఇవి సంచలనం రేపాయి. కోష్యారి వ్యాఖ్యలపై శివసేన నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కనీసం గవర్నర్ ప్రకటననైనా ఖండించాలని అని ట్వీట్ చేశారు. ‘బీజేపీ ప్రాయోజిత ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే మహారాష్ట్ర ప్రజలను అవమానించడం మొదలైంది. కష్టపడి పనిచేసే మహారాష్ట్ర ప్రజలను గవర్నర్ అవమానించార’ని తప్పుపట్టారు.