కివీస్ తో అదే జోరు కొనసాగేనా…

  • In Sports
  • January 22, 2019
  • 187 Views
కివీస్ తో అదే జోరు కొనసాగేనా…

నేపియర్‌: ఆస్ట్రేలియాలో జైత్రయాత్ర సాగించిన కోహ్లీసేన రెట్టించిన ఉత్సాహంతో పక్కనే ఉన్న న్యూజిలాండ్‌లో అడుగుపెట్టింది. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీసుల్లో తలపడనుంది. కంగారూ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా కఠినమైన కివీస్‌పై ఇదే ఊపులో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ప్రపంచకప్‌ ముందు అక్కడి కఠిన పరిస్థితుల్లో రాణించాలని కోరుకుంటోంది. ఆసీస్‌పై వన్డే సిరీసులో అద్భుతంగా రాణించినా సరే టీమిండియా మిడిలార్డర్‌ కూర్పుపై ఇప్పటికీ సందేహాలే నెలకొన్నాయి. సరైన కూర్పు కోసం చేసే చివరి ప్రయత్నం ఇదే కావాలని విశ్లేషకులు భావిస్తున్నారు. కంగారూ గడ్డపై వరుసగా మూడు అర్ధశతకాలు సాధించిన మాజీ సారథి ధోనీ పట్ల డ్రెస్సింగ్‌రూమ్‌లో ఆనందం నెలకొంది. కాగా కివీస్‌లో మైదానాలు చిన్నవి. ప్రత్యర్థి జట్టులో ట్రెంట్‌ బౌల్ట్‌, లాకీ ఫెర్గూసన్‌, టిమ్‌ సౌథీ పేస్‌ త్రయంతో కోహ్లీసేనకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ ఎప్పటికీ కఠినమైన జట్టే. అక్కడ భారత్‌ 35 వన్డేల్లో తలపడి గెలిచింది కేవలం 10 మాత్రమే. 2014 పర్యటనలో ఐదు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 4-0తో విజయ దుందుభి మోగించింది. ఒక మ్యాచ్‌ రద్దైంది. ఈ సారి తొలి మ్యాచ్‌ జరిగే మెక్‌లీన్‌ పార్క్‌లో వాతావరణం పొడిగా ఉండనుంది. న్యూజిలాండ్‌ ఆటగాళ్లపై భారత సారథి విరాట్‌ కోహ్లీకి మంచి అవగాహనే ఉంది. వారు గట్టి పోటీనిస్తారని ఊహిస్తున్నాడు. ‘ఆ జట్టు మూడో ర్యాంకులో ఉండటం కొన్నేళ్లుగా న్యూజిలాండ్‌ ఎంత నిలకడగా ఆడుతుందన్న దానికి ఉదాహరణ. గత సిరీస్‌లో వారిని ముంబయిలో ఓడించాం. మిగతా అన్ని మ్యాచుల్లో గట్టి పోటీనిచ్చారు. ఆ జట్టు సమతూకంగా ఉందని మాకు తెలుసు. ప్రత్యర్థి ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. సక్రమంగా, నిబద్ధతతో క్రికెట్‌ ఆడే కివీస్‌ను‌ కచ్చితంగా అభినందించి తీరాల్సిందే’ అని మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో కోహ్లీ అన్నాడు. ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ ఫామ్‌లో లేకపోవడం భారత్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్య. గత 9 మ్యాచుల్లో అతడి అత్యధిక స్కోరు 35 మాత్రమే. ధోనీని ఏ స్థానంలో ఆడించాలన్న విషయంపై స్పష్టత లేదు. సస్పెండైన హార్దిక్‌ పాండ్య వచ్చే వరకు జట్టును సమతూకంగా ఉంచడం కోహ్లీకి కష్టమే! యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ను ఇంగ్లాండ్‌ లయన్స్‌పై ఓపెనింగ్‌ దించుతున్నారంటే జాతీయ జట్టుకు మరో ఓపెనర్‌ను సిద్ధం చేస్తున్నారన్నట్టే! ఈ సిరీస్‌కు ఎంపికైన యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌కు తొలి మూడు వన్డేల్లో అవకాశం దొరక్కపోవచ్చు. ధావన్‌ను కొనసాగించొచ్చు. అంబటి రాయుడు ఎంపికైనప్పటికీ నాలుగో స్థానంలో ఆడిస్తారో లేదో తెలియడం లేదు. ఆసీస్‌ సిరీస్‌లో అతడు ఫామ్‌లో కనిపించలేదు. నేపియర్‌లో భారీ స్కోరుకు అవకాశం ఉండటంతో దినేశ్‌ కార్తీక్‌, కేదార్ జాదవ్‌ను ముందు పంపించే అవకాశం ఉంది. బౌలింగ్‌ విభాగం విషయానికి వస్తే భువనేశ్వర్‌, మహ్మద్‌ షమి పేస్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. మూడో పేసర్‌గా మహ్మద్‌ సిరాజ్‌, ఖలీల్‌ అహ్మద్‌లో ఎవరో ఒకరికి కోహ్లీ తుది జట్టులో చోటివ్వొచ్చు. న్యూజిలాండ్‌ టాప్ ఆర్డర్‌ అద్భుతంగా కనిపిస్తోంది. ఆ జట్టులో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకరైన సారథి కేన్‌ విలియమ్సన్‌ నిలకడకు మారుపేరు. రాస్‌టేలర్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. 2018లో కోహ్లీ తర్వాత ఎక్కవ సగటు (92) అతడికే ఉంది. తమ జట్టులో చేసుకోవాల్సిన మార్పుల గురించి శ్రీలంక సిరీస్‌లో గమనించామని తొలి మ్యాచ్‌కు ముందు విలియమ్సన్‌ అన్నాడు. ఏదేమైనప్పటికీ తొలి మ్యాచ్‌ గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.

భారత్‌: విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, విజయ్‌ శంకర్‌, శుభ్‌మన్‌  గిల్‌, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఖలీల్‌ అహ్మద్‌

న్యూజిలాండ్‌: కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, టామ్‌ లేథమ్‌, మార్టిన్‌ గప్తిల్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, హెన్రీ నికోల్స్‌, డగ్‌ బ్రాస్‌వెల్‌, లాకీ ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ, కొలిన్‌ మున్రో, ఇష్‌ సోధి, మిచెల్‌ శాంట్నర్‌, టిమ్‌ సౌథీ.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos