అమరావతి: తనను చంద్రబాబు నాయుడు బంట్రోతుగా వైకాపా సభ్యుడు చెవిరెడ్డి అభివర్ణించినందుకు తెదేపా సభ్యుడు అచ్చెన్నాయుడు గురువారం దిగువ సభలో తీవ్రంగా గర్హించారు. ‘అధ్యక్షా. సభాపతిగా ఎన్నికయిన మిమ్మల్ని ఎంతో గౌరవంగా మీ పీఠం వరకూ తోడుగా వచ్చాను.అందుకు చంద్రబాబు తన బంట్రోతును పంపారు అని చెవిరెడ్డి వ్యాఖ్యానించి నన్ను అవమానించారు. ఆ అన్న మాట మీకు తీపిగా ఉంటే దాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మేము ఎమ్మెల్యేలమా? లేక బంట్రోతులమా? అన్నది మీరే తేల్చాలి. ఓకే… మేము చంద్రబాబు బంట్రోతులం అయితే మీరు 150 మంది జగన్ మోహన్ రెడ్డి బంట్రోతులు అని ఒప్పుకోండి. శాసనసభ్యులం కాదని ఒప్పుకోండి. మీకు దండం పెడతాం. మేం శాసనసభ్యులుగా, ప్రజలు ఎన్నుకున్న నాయకులుగా సభకు వచ్చాం. తోటి శాసన సభ్యుడికి మరో శాసన సభ్యుడు గౌరవం ఇవ్వాలి’ అని హితవు పలికారు.