కొల్లం: ప్రభుత్వం సామాన్యుడిని ఇబ్బందికి గురిచేసిన విషయాలను ప్రశ్నించడంలో రాజీపడనని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ ఆధ్వ ర్యంలోని యూడీఎఫ్ కూటమి శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఐశ్వర్య కేరళ యాత్రలో పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేసి, ప్రత్యామ్నాయ మార్గాలను పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. “ప్రతిపక్షం అయినందుకు మేము ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. అనవసరంగా నేను కేంద్రాన్ని విమర్శించను. సామాన్యుడిని ఇబ్బందికి గురి చేసే విధంగా ప్రభుత్వం తప్పుడు చర్యలు చేపడుతున్నందుకు విమర్శిస్తున్నాము. రైతుల నిరసనలకు మేము మద్దతు ఇస్తున్నాము. జనవరి 26న జరిగిన ఘర్షణలు.. కేంద్రం తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం. ఖలిస్థానీ, పాకిస్థానీ అంటూ ఆరోపణలు చేస్తూ రైతులను విడగొట్టేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. ఇంధన ధరలను పెంచి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు కనిష్ఠానికి చేరుకుంటున్న సమయంలో ధరలు పెంచుతున్నారు. రోజూ ధరలు పెంచుతూ దేశప్రజలకు అన్యాయం చేస్తున్నార’ని దుయ్యబట్టారు. కేరళ ప్రభుత్వం కూడా ఇంధనంపై ఉన్న పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు.