ప్రతిపక్షాలు ఎంతగా నిరసనలు,హెచ్చరికలు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోని సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముమ్మరం చేశారు.ఈనెల 27వ తేదీన తెలంగలాణ కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో వాస్తు నిపుణులు సూచన మేరకు తెలంగాణ సచివాలయంలోని సీ బ్లాక్ ఈశాన్య ప్రాంతంలో భూమిపూజ పనులు చేయడానికి స్థలాన్ని ఫైనల్ చేశారు.ఆరు లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ భావించారు.తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు. తొమ్మిది నెలల్లో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది.అయితే తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ కొందరు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 27వ తేదీన ఈ విషయమై హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేయడం లేదని హైకోర్టుకు తెలంగాణ సర్కార్ అఫిడవిట్ను ఇచ్చింది.ఈ విషయాన్ని కూడ పిటిషనర్లు గుర్తు చేస్తున్నారు.కొత్త సచివాలయం నిర్మాణం కోసం ఇప్పటికే ఆర్అండ్ బి మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. తొలుత డీ బ్లాక్ను కూల్చివేయనున్నారు. ఆయా బ్లాకుల్లోని శాఖలను, మంత్రుల పేషీలను ఆయా శాఖల హెచ్ఓడీ కార్యాలయాలకు తరలించనున్నారు.