తెరాస కార్యాలయం ప్రగతి భవన్లో కేసీఆర్ ప్రేమగా పెంచుకుంటున్న శునకం హస్కీ అనుమానాస్పద మృతి కేసును హైదరాబాద్ నగర పోలీసులు మూసివేశారు.కొద్ది రోజుల క్రితం హస్కీ హఠాత్తుగా అనారోగ్యానికి గురై మృతి చెందడంతో ఆలనా, పాలనపై నిర్లక్ష్యం వహించారంటూ, పశువైద్యాధికారులు డాక్టర్ రంజిత్, లక్ష్మీలపై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే.ఆపై హస్కీకి పోస్టుమార్టం చేయగా, అది సహజ మరణమేనని తేలింది. ఇదే సమయంలో ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ సైతం, ఈ కేసులో పశువైద్యాధికారులపై కేసును ఎత్తివేయాలని కోరింది. దీంతో ఈ కేసును మూసివేయాలని కోరుతూ హైదరాబాద్ సిటీ పోలీసులు స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు కేసును క్లోజ్ చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.పెంపుడు కుక్క మృతి చెందడంతో తీవ్రంగా స్పందించిన కేసీఆర్ పశువైద్యులపై కేసు నమోదు చేయించడంపై ప్రతిపక్షాలతో పాటు ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అదే సమయంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకోని కేసీఆర్ పెంపుడు కుక్క మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణించడం ఏంటంటూ విమర్శలు,ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు..