శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రను నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం, యాత్రికులతో పాటు పర్యాటకులను తక్షణమే వెనక్కు రావాల్సిందిగా ఆదేశించడంతో శ్రీనగర్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. చాలా మంది ప్రయాణికులకు టికెట్లు దొరకడం లేదు. అదనపు విమానాలు నడపడానికి సిద్ధంగా ఉండాలని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ విమానయాన సంస్థలను ఆదేశించింది. రద్దీకి అనుగుణంగా విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేసినట్లు ఇండియన్ ఎయిర్లైన్స్, ఇండిగో, విస్టారా సంస్థలు ప్రకటించాయి. కశ్మీర్లో ఎన్నడూ ఇటువంటి భయానక పరిస్థితులను చూడలేదని పలువురు యాత్రికులు తెలిపారు. మరో వైపు కశ్మీర్ లోయలో శాంతిని పునరుద్ధరించడానికి సహకరించాలని, వదంతులను నమ్మవద్దని గవర్నర్ సత్యపాల్ మాలిక్ కోరారు. పరిస్థితులు చేయి దాటి పోతుండడంతో కశ్మీరీ వాసులు నిత్యావసర సరుకులను నిల్వ చేసుకోవడానికి దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. ఏటీఎంలు, ఔషధ దుకాణాలు రద్దీగా మారాయి. పెట్రోలు బంకుల వద్ద చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి.