ముంబై : నష్టాల్లో కూరుకుపోయి ఆగిపోయిన జెట్ ఎయిర్వేస్ను ఆదుకోవడానికి ఆ సంస్థ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ సిద్ధమయ్యారు. తన సొంత నిధుల నుంచి రూ.250 కోట్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ యాజమాన్యంగా వ్యవహరిస్తున్న బ్యాంకుల కన్సార్టియానికి ఆ నిధులను అందుబాటులో ఉంచానని తెలిపారు. సంస్థ చైర్మన్ పదవిని వదులుకున్న ఆయన మెజారిటీ వాటాలను కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఆయన పదవి నుంచి వైదొలిగాక సంస్థను కాపాడడానికి నిధులను తీసుకు రావడంలో వాటాదారులు విఫలమయ్యారు. గత నెల 17 నుంచి సంస్థ సేవలు నిలిచిపోయాయి. అందులో పని చేస్తున్న 22 వేల మంది సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరో వైపు సిబ్బంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంస్థ సేవలను పునరుద్ధరించేలా నిధులు విడుదల చేయాలని బ్యాంకుల కన్సార్టియంను ఆదేశించాలని వారు కోరారు.