హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం ఇక్కడ ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యంత్రి కే. చంద్రశేఖర రావును కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, జగన్ దంపతులకు సాదర స్వాగతం పలికారు. జగన్ను ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా జగన్ను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కేసీఆర్ తన మంత్రి వర్గ సహచరులను జగన్కు పరిచయం చేశారు. జగన్ సతీమణి వైఎస్. భారతికి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ నెల 30న విజయవాడలో జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాల్సిందిగా జగన్, కేసీఆర్ను ఆహ్వానించారు. జగన్తో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు.