కాసేపట్లో ఐపీఎల్ క్రికెట్ టోర్నీకి అంకురార్పణ జరగబోతోంది. రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలో జరుగుతుంది. 51 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పండుగలో ఎనిమిది ఫ్రాంచైజీలతో కూడిన జట్లు అరవై మ్యాచులు ఆడనున్నాయి. మే ఆఖరు నుంచి ఇంగ్లండ్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్పునకు ముందే అభిమానులకు ఈ ఐపీఎల్ కనువిందు చేయనుంది. ఇప్పటి దాకా ఒక జట్టులో ఆడిన ఆటగాళ్లంతా ఇకమీదట ప్రత్యర్థులుగా మైదానంలో దిగి సవాళ్లు విసురుకోనున్నారు. మే 12న ఈ టోర్నీ ముగియనుండగా, 31 నుంచి ప్రపంచ కప్పు ప్రారంభమవుతుంది. కనుక ఆటగాళ్లపై అధిక పని భారం పడకుండా ఆయా దేశాల క్రికెట్ బోర్డులు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రోటేషన్ పద్ధతిలో ఆడించడం ద్వారా ప్రధాన ఆటగాళ్లకు ఎక్కువ విశ్రాంతి ఇచ్చే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆసీస్ ఆటగాళ్లు కొందరు స్వచ్ఛందంగా ఈ టోర్నీకి దూరమయ్యారు. మరి కొందరు విదేశ ఆటగాళ్లు లీగ్ మధ్యలో తిరుగు ముఖం పట్టనున్నారు.