ముంబై: తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) బుధవారం ఇక్కడ మృతి చెందారు. పెద్దపేగు వ్యాధితో ఇక్కడి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస వదలారు. గత కొన్నేళ్లుగా కేన్సర్ వ్యాధితో బాధపడిన ఆయన కొన్ని నెలల కిందట కోలుకున్నారు. మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల కిందట ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీద బేగం (95) మృతి చెందింది. రాజస్థాన్లోని జైపూర్లో ఆమె అంత్యక్రియలు జరగగా ఇర్ఫాన్ ఖాన్ వెళ్లలేక పోయారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తల్లి అంత్యక్రియలను చూశారు. ఈ ఘటన ఆయనను మరింత బాధ పెట్టేలా చేసింది. తల్లి మరణంతో డిప్రెషన్లోకి వెళ్లారని ఆయన మిత్రులు తెలిపారు. ఒక గొప్ప నటుడిని కోల్పోయామంటూ పలువురు నటులు ట్వీట్లు చేశారు. స్లమ్డాగ్ మిలియనీర్, మఖ్బూల్, లంచ్బాక్స్ చిత్రాలు ఆయన కెరీర్లో మరిచిపోలేనివిగా నిలిచాయి. మహేశ్ బాబు నటించిన సైనికుడు సినిమాలో ఆయన విలన్గా నటించారు. 2011లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.