బెంగళూరు: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నుంచి మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైదొలిగారు. ఇన్ఫోసిస్ ఎనర్జీ, యుటిలిటీస్, రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ యూనిట్ గ్లోబల్ హెడ్ సుదీప్ సింగ్ రాజీనామా చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా కంపెనీలో పనిచేస్తున్న సుదీప్ తాజాగా తన బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. అయితే ఆయన రాజీనామాకు గల కారణాలపై స్పష్టత లేదు. మరోవైపు ఇన్ఫోసిస్ కూడా దీనిపై స్పందించలేదు. గతేడాది ఇన్ఫోసిస్ చాలా మంది కీలక ఉద్యోగులను కోల్పోయింది. సుదీప్ కంటే ముందు గతేడాది అక్టోబరులో ఇన్ఫీ కన్సల్టింగ్ గ్లోబల్ హెడ్ కెన్ టూంబ్స్ రాజీనామా చేశారు. అంతకు ముందు ఆగస్టులో కంపెనీలో కీలక ఎగ్జిక్యూటివ్ అయిన ఎండీ రంగనాథ్ కూడా సీఎఫ్వో పదవి నుంచి తప్పుకొన్నారు. గతేడాది జనవరిలో కంపెనీ యూరప్ కార్యకలాపాలకు హెడ్గా ఉన్న రాజేశ్ కృష్ణమూర్తి కూడా రాజీనామా చేశారు. ఇన్ఫీ హెల్త్కేర్కు హెడ్గా ఉన్న సంగీతా సింగ్, మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ నితేశ్ బంగా కూడా గతేడాది కంపెనీ నుంచి వైదొలిగారు.