31న ఇండియా ఫోరం మెగా ర్యాలీ

31న ఇండియా ఫోరం మెగా ర్యాలీ

న్యూ ఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత, బలం బలోపేతం లక్ష్యంతో ఇండియా ఫోరం 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ‘మహా ర్యాలీ’ నిర్వహించనుంది. ప్రతిపక్షాలపై కేంద్రం దాడికి వ్యతిరేకంగా, కేజ్రీవాల్కు మద్దతుగా ఈ ర్యాలీలో ఇండియా ఫోరం జాతీయ నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు ఆదివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆప్ మంత్రులు గోపాల్ రారు, అతిషి, సౌరభ్ భరద్వాజ్, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ, సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాజీవ్ కున్వార్ మాట్లాడారు. తొలుత ఢిల్లీ మంత్రి గోపాల్ రారు మాట్లాడుతూ బీజేపీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, 31 ఉదయం 10 గంటలకు జరిపే ర్యాలీలో పాల్గొనాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన తీరును దేశ వ్యాప్తంగా రాజ్యాంగాన్ని ప్రేమించే, గౌరవించే వారందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇది కేవలం కేజ్రీవాల్ గురించి మాత్రమే కాదు. మొత్తం ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టడానికి మోడీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. అమ్ముడుపోవడానికి, తలవంచడానికి సిద్ధంగా లేని వారిపై కేసులు నమోదు చేసి.. జైళ్లో వేస్తున్నారు. ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి, విస్తరించడానికి రాంలీలా మైదాన్లో ర్యాలీ నిర్వహించనున్నాం. ఇది ఇండియా ఫోరం మహా ర్యాలీ అవుతుంది. ఢిల్లీ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారు రాంలీలా మైదానానికి రావాలని విన్నవిస్తున్నాం”అని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ర్యాలీ: అతిషి
‘మహా ర్యాలీ’ కేజ్రీవాల్ను రక్షించడానికి కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అని ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు. ”ఇండియా ఫోరం ‘మహా ర్యాలీ’ అరవింద్ కేజ్రీవాల్ను రక్షించడానికి కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి. ప్రతిపక్షంపై బీజేపీ ఏకపక్ష దాడులు చేస్తోంది” అని ఆమె విమర్శించారు. ‘దేశంలో ప్రజాస్వామ్యం అపాయంలో ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. నియంతృత్వాన్ని పారదోలాల్సిన సమయం వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, అభిమానించే ప్రతి ఒక్కరిని వేధిస్తున్నారు. వ్యవస్థలను ప్రధాని మోడీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు’ అని మండిపడ్డారు.31వ తేదీన చేపట్టే మహా ర్యాలీ రాజకీయాలకు అతీతం అని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. ఎన్నికైన ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని, రాజకీయ పార్టీ ఖాతాలను స్వాధీనం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ర్యాలీ చేపడుతున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు వినిపిస్తామని అన్నారు. 31న ‘ఇండియా’ బ్లాక్కు చెందిన మిత్రపక్షాల నేతలు ఏకతాటిపైకి వస్తారని సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాజీవ్ కున్వార్ తెలిపారు. ప్రజా స్వామ్యంపై దాడులను తాము సహించబోమని అన్నారు. దీనిపై పోరాడుతామని స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos