న్యూ ఢిల్లీ: ఆయుర్వేద వైద్యులూ శస్త్ర చికిత్సలు చేయడానికి భారతీయ కేంద్ర వైద్య మండలి సీసీఐఎం అనుమతించినందుకు వ్యతిరేకంగా డిసెంబరు 11న ధర్నా చేపట్టనున్నట్లు భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) వెల్లడించింది. ఆధునిక వైద్యం చేసే వైద్యులంతా ఆ రోజు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ అత్యవసర సేవలు, కొవిడ్ సంబంధ సేవలు మినహా ఇతర విధులను బహిష్కరించాలని పిలుపు నిచ్చింది. సాధరణ శస్త్ర చికిత్సలు కూడా నిర్వహించరాదని నిర్దేశించింది. ఇంకా డిసెంబరు 8న మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకూ బహిరంగ నిరసన చేపట్టాలని కోరింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ 20 మందికి మించని బృందాలతో ధర్నా చేయాలని సూచించింది. దీన్ని ఆధునిక వైద్యం చేస్తున్న స్వాతంత్య్ర ఉద్యమంగా ఐఎంఏ పేర్కొంది.