ఇంగ్లండ్లో వచ్చే నెల 30 నుంచి ప్రారంభం కానున్న క్రికెట్ ప్రపంచ కప్పు పోటీలకు మన దేశం నుంచి ఒకే ఒక అంపైర్ ఎంపికయ్యారు. ఆయనే సుందరం రవి. ఈసారి ప్రపంచ కప్పు విశేషాలేమిటంటే…గతంలో ప్రపంచ కప్పు విజేత జట్లలోని సభ్యులు అంపైర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే ఆరంభ మ్యాచ్ అంపైర్లుగా ముగ్గురు ప్రపంచ కప్పు విజేతలు వ్యవహరించబోతున్నారు. వీరిలో డేవిడ్ బూన్ మ్యాచ్ రెఫరీ కాగా, కుమార ధర్మసేన ఫీల్డ్ అంపైర్లలో ఒకరుగా ఉంటారు. పాల్ రీఫెల్ థర్డ్ అంపైర్గా వ్యవహరిస్తారు. బూన్ 1987లో అలెన్ బోర్డర సారథ్యంలో ప్రపంచ కప్పు గెలిచిన ఆస్ట్రేలియా జట్టు సభ్యుడు. 1996లో అర్జున రణతుంగ కెప్టెన్సీలో ప్రపంచ కప్పును గెలుచుకున్న శ్రీలంక జట్టులో ధర్మసేన సభ్యుడు. స్టీవ్ వా నాయకత్వంలో 1999లో ప్రపంచ కప్పును గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో పాల్ రీఫెల్ సభ్యుడు. లీగ్ మ్యాచ్లకు ఇరవై రెండు మందితో కూడిన అధికారులను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. వీరిలో 16 మంది అంపైర్లు, ఆరుగురు మ్యాచ్ రెఫరీలు ఉన్నారు. ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచులు ఆడాల్సి ఉంది. కాగా భారత్ అంపైర్ సుందరం రవి ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు. గత నెలలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో లసిత్ మలింగ ఆఖరి బంతిని నో బాల్గా వేసినప్పటికీ రవి గమనించకపోవడంతో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆయన గదికే వెళ్లి దూషించినట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచ కప్పునకు ఎంపికైన ఇతర మ్యాచ్ అధికారులు…క్రిస్ బ్రాడ్, జెఫ్ క్రో, ఆండీ పైక్రాఫ్ట్, రంజన్ మదుగల్లె, రిచీ రిచర్డ్సన్ (మ్యాచ్ రెఫరీలు). అలీం దార్, మేరియస్ ఎరస్మస్, క్రిస్ గఫానీ, ఇయాన్ గుడ్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిచర్ట్ కెటిల్బరో, నిజెల్ లాంద్, రుచిరా పల్లియగురగె, రాడ్ టకర్, మైఖేల్ గాఫ్, పాల్ విల్సన్, రవి (అంపైర్లు).