హొసూరు : కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల హొసూరు సమీపంలోని కెలవరపల్లి డ్యాంకు వచ్చే వరద నీరు రోజు రోజుకు ఉధృతమవుతోంది. హొసూరు సమీపంలో దక్షిణ పెన్నానదిపై కెలవరపల్లి డ్యాంను నిర్మించారు. కర్ణాటక రాష్ట్రం నంది కొండల్లో పుట్టిన దక్షిణ పెన్నా నది హొసూరు సమీపంలోని కోడియాలం వద్ద తమిళనాడులో ప్రవేశిస్తుంది. గత కొద్ది రోజులుగా నందికొండలతో పాటు దక్షిణ పెన్నా పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల వల్ల నదిలో వరద ఉధృతి పెరిగింది. మంగళవారం డ్యాంకు 808 కూసెక్కుల నీరు చేరుతుండగా బుధవారం 968 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో అయిదు గేట్ల ద్వారా 968 క్యూ సెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.