హోసూరు : ఆదర్శ యూనియన్గా హోసూరును తీర్చిదిద్దుతామని హోసూరు యూనియన్ చైర్పర్సన్ శశి వెంకటస్వామి అన్నారు. చైర్పర్సన్గా ఎన్నికైన ఆరు నెలల్లోనే యూనియన్ను ఎంతో అభివృద్ధి చేశామని ఆమె తెలిపారు. యూనియన్లో మౌలిక వసతుల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వెల్లడించారు. హోసూరు యూనియన్లోని 26 పంచాయతీలలో రూ.1.25 కోట్ల ఖర్చుతో తాగు నీటి సమస్యను పరిష్కరించడానికి బోర్లు వేశామని తెలిపారు. యూనియన్లోని చెరువులు, కుంటలలో పూడిక తీసే పనులు చేపట్టినట్లు వెల్లడించారు. కరోనా నిరోధక చర్యలలో భాగంగా యూనియన్లోని అన్ని గ్రామాలలో క్రిమి సంహారక మందులను పిచికారీ చేసి మాస్కులు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి సహకారంతో హోసూరు యూనియన్కు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి, మరింత అభివృద్ధి చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కరోనా ప్రభావంతో పేదలకు ఇబ్బంది కలుగకుండా నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రానున్న నాలుగేళ్లలో హోసూరు యూనియన్లోని అన్ని పంచాయతీలలో అన్ని వసతులు కల్పించి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే తన ధ్యేయమని శశి వెంకటస్వామి ప్రకటించారు.