మరో బృహత్తర ఆరోగ్య పథకానికి కేసీఆర్‌ శ్రీకారం!

మరో బృహత్తర ఆరోగ్య పథకానికి కేసీఆర్‌ శ్రీకారం!

ఇప్పటికే పలు పథకాల ద్వారా ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా సార్వజనిక ఆరోగ్య సంరక్షణ పథకాన్ని(యూనివర్సల్‌ హెల్త్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌) అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే వేర్వేరు ఆరోగ్య పథకాల కింద దాదాపు కోటి కుటుంబాలకు వైద్య సేవలు లభ్యమవుతున్నాయి. వీటన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి ఏకగవాక్ష విధానంలో అమలు చేయడంపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. తద్వారా నిధులు సద్వినియోగమవడంతోపాటు ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యసేవలందించడానికి మార్గం సులభమవుతుందని భావిస్తోంది.రాష్ట్రంలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, ఆరోగ్య భద్రత, ఆర్టీసీ, సింగరేణి, ఈఎస్‌ఐల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా వైద్యసేవలకయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తోంది. అదనంగా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం ఏటా పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోంది. మొత్తంగా అన్నింటికీ కలిపి ఏటా దాదాపు 2 వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ నిధులు ఖర్చవుతున్నట్లు అంచనా. అయినా వైద్య సేవల్లో లోటుపాట్లు ఎదురవుతూనే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ మినహా మిగిలిన ఏ పథకం అమల్లోనూ ఆన్‌లైన్‌ సమాచారం పొందుపర్చడం లేదు. ఆయా జిల్లాల్లో ఎటువంటి వ్యాధులు ప్రబలుతున్నాయి? వారికి అందుతున్న వైద్య సేవలు ఏమిటి? అనే సమాచారమేదీ అందుబాటులో ఉండటం లేదు. ఈ దృష్ట్యా వైద్యారోగ్యశాఖ కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తెలిసింది.’ఏ పథకం కింద ఎన్ని కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి? వాటికి ఏటా అయ్యే ఖర్చు ఎంత? వాటన్నింటినీ ఒకే గూటికి తేవడం ద్వారా ఏవిధంగా మెరుగైన వైద్యసేవలు అందించవచ్చు?’ తదితర అంశాలతో కూడిన సమాచారాన్ని ప్రతిపాదనల్లో పొందుపర్చినట్టు సమాచారం.గతంలో పేదప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలతో పాటు కళ్లజోళ్లు,మందులు అందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటివెలుగు పథకానికి ఉత్తమ స్పందన లభించడంతో సీఎం కేసీఆర్‌ ఈ బృహత్‌ ప్రణాళికలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.ఇంతవరకు బాగానే ఉన్నా పథకం అమలుకు ఆర్థిక వనరుల లోటు గుదిబండగా మారనుంది. ఆర్థిక సమస్యలను అదిగమించి అదికారులు పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే మంచి ఫలితాలు రావడం ఖయమనే చర్చ తెలంగాణ ప్రజానికంలో జరుగుతోంది. ఇదే విషయంపై ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతాధికారులతో చర్చించారు. ‘వేర్వేరు పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా వంద శాతం ప్రజలకు ఉచిత వైద్యం అందించవచ్చని, వైద్య సేవల సంఖ్య పెంచడంతోపాటు నిధులనూ పారదర్శకంగా వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది.ముఖ్య‌మంత్రి చంద్రశేఖర్ రావు తో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నాం’ అని వైద్య వర్గాలు తెలిపాయి. .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos