జమ్ము కశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.కశ్మీర్పై నిర్ణయంపై పాకిస్థాన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం ఏమైనా జరగొచ్చంటూ సాక్షాత్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు,విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేసింది.అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సందర్శకుల అనుమతికి నిరాకరించాలని ఆదేశించింది. ఇప్పటికే విమానయాన మంత్రిత్వ శాఖ అన్ని ఎయిర్ పోర్ట్ లలో సందర్శకులకు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 10 నుంచి 20 వరకు తాత్కాలికంగా సందర్శకులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. విమానశ్రయాల్లో కూడా దాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్ లలో భద్రత కట్టుదిట్టం చేశారు. అన్ని విమానాశ్రయాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. పంద్రాగస్టు అనే కాకుండా జమ్ముకశ్మీర్ విభజన నేపథ్యంలో ఉగ్రవాదులు భారత్ పై రగిలిపోతున్నారని తెలిపింది. భారత్ పై దాడులకు తెగబడేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. సామాన్య ప్రజానికమే లక్ష్యంగా విరుచుకుపడేలా ఉగ్రవాద సంస్థలు కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశాయి. అంతేకాకుండా జైషే మెహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు సైతం తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు..