అమరావతి: పారదర్శక పరిపాలనకు పట్టం కట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగానికి పిలుపు నిచ్చారు. శనివారం తొలి సారిగా సచివాలయంలోని తన కార్యాలయంలో విధి నిర్వహణను ఆరంభించిన తర్వాత వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశ మయ్యారు. ‘అవినీతికి ఆస్కారంలేని పారదర్శక పాలన అందించడానికి ధృడ సంకల్పంతో ఉన్నాం. అనేక సవాళ్లను సైతం ఎదుర్కొని మంచి పనితీరు ప్రదర్శించే ప్రతిభ అధికారులకు ఉంది. అధికారులు తమకున్న పూర్తి అవగాహనతో సహకరించాలి. మీరు పూర్తిగా సహకరిస్తే ప్రజలు, ప్రభుత్వం కల నెరవేరుతుంది. మీపై నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. అనవసర వ్యయాన్ని తగ్గించాలి. మంచి పని తీరు కనబరిచే అధికారులను సత్కారాలతో గౌరవిస్తాం. మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలి. చేసే పనులు మీ ముందు ఉంచుతామని ప్రధాన న్యాయమూర్తికి చెప్పా. న్యాయమైన నిర్ణయం జ్యుడీషియల్ కమిషన్ తీసుకోవాల్సిందిగా కోరా. గతంలో కాంట్రాక్టులు అంటే కేవలం తమకు అనువైన వారికే ఉండేవి. ఇక ఆ పరిస్థితి తలెత్తకుండా రివర్స్ టెండరింగ్కు వెళ్తాం’ అని విపులీకరించారు. ‘రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులైన అధికారుల సమాహారం ఉంది. లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేసే అధికారులు ఉన్నార’ని ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం తెలిపారు.